భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు, సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న గడ్డిగానిపల్లికి చెందిన సెగ్గం సాయి వర్ధన్, సెగ్గంపల్లికి చెందిన దాసరి వంశీ, దుర్గం మహార్షిలను అదుపులోకి తీసుకుని విచారించగా.
వారు ఇచ్చిన సమాచారంతో గంజాయి సరఫరా చేస్తున్న ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, రొయ్యూరు గ్రామానికి చెందిన జాడి మనోజ్, దుర్గం కిరణ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుండి మొత్తం 210 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని, గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

