# పైలాన్ నిర్మాణ పనులు, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క
ములుగు: ఈ నెల 16న ములుగు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పైలాన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు, గుత్తేదారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించిన మంత్రి.. భవనంలోని వివిధ విభాగాలు, కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, పరిసరాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారులు, పార్కింగ్తో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తమకు అప్పగించిన బాధ్యతలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
# మేడారంలో ప్రత్యేక పూజలు
అనంతరం పాత్రికేయులతో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ నెల 16న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం మేడారం చేరుకుని శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అనంతరం వనదేవతల సన్నిధి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకున్న వారిని గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
# రూ.16 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల పనులు
మేడారం కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుని గట్టమ్మ సమీపంలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా మూడు విడతల్లో సుమారు రూ.16 వేల కోట్లతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరిస్తారని మంత్రి తెలిపారు.
ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో పెద్ద ఎత్తున రహదారి పనులను చేపడుతోందని పేర్కొన్నారు.
# నూతన కలెక్టరేట్ ప్రారంభం
అనంతరం ముఖ్యమంత్రి నూతన కలెక్టరేట్కు చేరుకుని తొలుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసే సభలో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ములుగు నియోజకవర్గ, జిల్లా ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి సీతక్క ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ చందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

