శ్రీరాంపూర్: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాల జోన్ పరిధిలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వివిధ నేరాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమపద్ధతిలో భద్రపరచాలని సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్లో 5ఎస్ విధానాన్ని అమలు చేసి, అన్ని రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించిన కమిషనర్.. దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులు, నిందితుల అరెస్టులు, పెండింగ్ కేసులు, వాటి పెండింగ్కు గల కారణాలను ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ఐ సంతోష్లను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఎస్ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో మాట్లాడిన కమిషనర్.. ఆన్లైన్లో వివరాల నమోదు, రికార్డుల అప్లోడ్ ప్రక్రియను సమీక్షించారు. విధుల్లో ఉన్న బ్లూకోట్స్ సిబ్బందితో ఫోన్లో మాట్లాడి వారి స్థాన వివరాలు, విధుల నిర్వహణపై ఆరా తీశారు. కోర్టు విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారి విధులు, ఆరోజు కోర్టులో విచారణకు ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ కనిపించేలా పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించవద్దని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిబ్బందికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ తనిఖీలో శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ అశోక్ పాల్గొన్నారు.

