రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీ బి.రామ్ రెడ్డి సోమవారం గోదావరిఖని డివిజన్ పరిధిలోని గోదావరిఖని II టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న డీసీపీకి గోదావరిఖని II టౌన్ సీఐలు ప్రసాద్రావు,మరియు లింగమూర్తి లు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
డీసీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు,సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం రిసెప్షన్, స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు.తదుపరి స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు,సిబ్బంది వివరాలను ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ పరిధిలో అధికంగా నమోదవుతున్న నేరాల స్వరూపం, రౌడీ షీటర్ల వివరాలు, అనుమానితుల ప్రస్తుత పరిస్థితులు గురించి ఆరా తీశారు.
స్టేషన్వారీగా బ్లూ కోల్ట్స్ సిబ్బంది పనితీరు,వారి విధుల నిర్వహణ సమయాలను కూడా తెలుసుకున్నారు.
అనంతరం డీసీపీ అధికారులకు పలు సూచనలు చేస్తూ, ప్రతి స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీ షీటర్ల నివాసాలను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత,రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలని పేర్కొన్నారు.గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి, మత్తు పదార్థాల నియంత్రణకు నిరంతరం కృషి చేయాలని స్టేషన్ అధికారులను ఆదేశించారు.
నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అత్యంత అవసరమని, పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు.

