మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా విని పరిశీలించారు.
ఈ సందర్భంగా అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం జరిగేలా నిర్దిష్ట కాలవ్యవధిలో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రజలకు సత్వర న్యాయం అందించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖను ఆశ్రయించినప్పుడు వారి వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి పారదర్శకంగా విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని పేర్కొన్నారు.
అందిన ప్రతి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిశీలించి, బాధితులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలందించడం ప్రతి పోలీసు అధికారికి బాధ్యత అని తెలిపారు.
జిల్లా ప్రజలు తమ సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని, అందిన ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

