పెద్దపల్లి : శ్రావణమాస ప్రత్యేకతను పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో ఆచార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భోజనాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆచార్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జవ్వాజి రాజేష్ మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదలు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. పండుగలు, పర్వదినాలను కేవలం వ్యక్తిగతంగా కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ద్వారా మానవతా విలువలను చాటవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి కొమరిశెట్టి రమేష్, అలీముద్దీన్, బజ్జారి సురేష్, కుమారస్వామి, నర్సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

