*రూ. 50 వేల చెక్కు అందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
రాజన్న సిరిసిల్ల: ఇద్దరు దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం అందజేశారు. బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం కొమురవ్వకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు దివ్యాంగులు. దివ్యాంగురాలైన సాగరిక, దివ్యాంగుడైన వేణు అనారోగ్యానికి గురయ్యారు. వారికి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించారు. కొమురవ్వ భర్త గల్ఫ్ కు వెళ్లి అక్కడే మరణించారు. ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను కలిసి తమ ఇబ్బందులను విన్నవించారు. పిల్లలను చూసుకోవడం కోసం తాను ఇంటికే పరిమితమై పోయినది. కూలి పనులకు సైతం కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి జిల్లా సంక్షేమ అధికారితో విచారణ చేయించి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. దీంతో వారికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం రూ.50 వేల చెక్కును అందజేశారు. భవిష్యత్తులో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తమ పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్ కు కొమురవ్వ కృతజ్ఞతలు తెలియజేశారు.

