ప్రజా నావ,గోదావరిఖని: పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉదయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, 23వ డివిజన్ కార్పోరేటర్ బెంద్రం సునీత రాజిరెడ్డి తో కలిసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డివిజన్ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక అవసరాలు, మౌలిక వసతులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రామగుండం ప్రాంతాన్ని గొప్ప నగరంగా అభివృద్ధి చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పట్టణ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా చెత్తను కాలువల్లో వేయకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

