ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 50 సైకిళ్ల పంపిణీ.
అమ్మకు అక్షరమాలతో మహిళల్లో విద్యా చైతన్యం.
సేవా కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలి:మంత్రి సీతక్క
కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో,
రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 50 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క , జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి హాజరై విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ములుగు జిల్లా నిరక్షరాస్యత అధికంగా ఉన్న వెనుకబడిన జిల్లా అయినప్పటికీ జిల్లా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో 50 సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

