ధర్మపురి: కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 67 క్రిమినల్ కేసులు, 562 పెట్టి కేసులు పరిష్కారమయ్యాయి.ఈ సందర్భంగా న్యాయమూర్తి యేగి జానకి మాట్లాడుతూ, “రాజీమార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, ప్రజలు తమ వివాదాలను పరస్పర అవగాహనతో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు. రాజీ ద్వారా ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూరడంతో పాటు కోర్టులపై భారం కూడా తగ్గుతుందని అన్నారు.
లోక్ అదాలత్ సందర్భంగా విడివిడిగా ఉంటున్న ఒక దంపతులు కౌన్సిలింగ్ అనంతరం తిరిగి కలిసి జీవించేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి యేగి జానకి వారిని అభినందిస్తూ, పరస్పర గౌరవం, అవగాహనతో సంతోషకరమైన కుటుంబ జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఒక కుటుంబం మళ్లీ ఒక్కటవడం లోక్ అదాలత్ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐ రాం నరసింహారెడ్డి, ధర్మపురి ఎస్ఐ మహేష్, వెల్గటూర్ ఎస్ఐ ఉదయ్, బుగ్గారం ఇన్చార్జ్ ఎస్ఐ రవీందర్, ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జాజాల రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బందేల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రామడుగు రాజేష్, సీనియర్ న్యాయవాదులు గడ్డం సత్యనారాయణరెడ్డి, అప్పాల నిరంజన్, రౌతు రాజేష్, న్యాయవాదులు బత్తిని ఇంద్రకరణ్, కలమడుగు హరిప్రసాద్, కోర్టు సూపరింటెండెంట్ భీష్మాచారి, ఇతర న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

