* మండల స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు
* ప్రజా ప్రతినిధులు–అధికారులు సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన
* గ్రామాల్లో మౌలిక వసతులు, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి
ఖానాపూర్: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, సర్పంచులతో సమావేశమైన ఎమ్మెల్యే గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో విద్యుత్, రోడ్లు, వ్యవసాయం, వైద్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా జలసిరి పథకం కింద 100 శాతం ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అంగన్వాడీ నియామకాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, వర్షాకాలంలో వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

