* 14వ వార్డు కౌన్సిలర్ అస్లాం పర్వేజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
పెద్దపల్లి : పింఛన్లు ఇప్పిస్తామని ఆశ చూపి మహిళలను పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. 14వ వార్డు కౌన్సిలర్ అస్లాం పర్వేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనతో మంగళవారం పెద్దపల్లిలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ వస్తుందని, దరఖాస్తు చేసుకునేందుకు ఇదే చివరి తేదీ అంటూ ఆశ చూపి కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి డ్రామాలు ఆడారని కౌన్సిలర్ అస్లాం పర్వేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంతో మహిళలు తీవ్రంగా అవమానానికి గురయ్యారని ఆయన ఆరోపించారు. దీనికి నిరసనగా అస్లాం పర్వేజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముట్టడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ అస్లాం పర్వేజ్కు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ముట్టడికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో చివరకు ఆందోళనకారులు వెనుదిరిగారు. దీంతో కొంతసేపు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి.

