* ఎన్టీపీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టిటిఎస్లో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీని బుధవారం సందర్శించిన ఈఎస్ఐ వరంగల్ జాయింట్ డైరెక్టర్ హేమలతకు ఎన్టీపీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
డిస్పెన్సరీలో వైద్యుల కొరత, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డిస్పెన్సరీలో నెలకొన్న పరిస్థితులను ఆమెకు వివరించగా, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు కార్మిక నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మిక వర్గ జిల్లా అధ్యక్షులు హైమద్ బాబా, హెచ్ఎంఎస్ నాయకుడు డి. సత్యం, బీఎంఎస్ నాయకుడు టి. శ్రీనివాస్, టీయూసీఐ నాయకుడు పి.ఎన్. భూషణ్, కేసీఎంఎస్ నాయకుడు సీహెచ్. సత్యం, గోదావరి యూనియన్కు చెందిన రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

