* రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారీ తనిఖీ
* సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, భద్రతా ఏర్పాట్ల పరిశీలన
* ఈవీఎంల భద్రత విషయంలో రాజీ లేదని కలెక్టర్ స్పష్టం
ములుగు : జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారీ తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా గోదాంపై ఉన్న సీల్స్ను పరిశీలించడంతో పాటు సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.
అలాగే గోదాం వద్ద పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించిన కలెక్టర్, ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రతి నెల గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా 24 గంటలు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, గోదాంలోని భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం.డి. సలీం, డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

