– దిష్టిబొమ్మ దహనం
– కెసిఆర్, మధుసూదన్, కేటీఆర్, ఫోటోలకు చెప్పుల దండ వేసిన కాంగ్రెస్ నాయకులు
ప్రజానావ / మంచిర్యాల :అసెంబ్లీ స్పీకర్ గారి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చెన్నూర్ పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ఎమ్మెల్యే ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తాతా మధుసూదన్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ గారి పై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ పదవులకు, వాటిలో ఉన్న వ్యక్తులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు.
అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికకు సంబంధించిన అంశాల్లో ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని, హుందాగా వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి స్పీకర్ గారి పై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. తాతా మధుసూదన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

