◆ ఏవోలదే పూర్తి బాధ్యత: కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడి వరి సాగు చేయకుండా, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించి, జిల్లాలో పంటల మార్పిడిని విజయవంతం చేయాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి రైతులు ఆతురుతతో వరి సాగుపైనే ఆధారపడవద్దని స్పష్టం చేశారు. ప్రతి మండల వ్యవసాయ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటల మార్పిడి బాధ్యతను స్వీకరిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

