Friday, August 14, 2026

Buy now

చేయూత కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

* ఆగస్టు 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
* అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదు
* గతంలో అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే కొత్త పింఛన్లు

హైదరాబాద్: అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త పింఛన్ల కోసం 2026 ఆగస్టు 31 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్‌ సెల్‌ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.

* అర్హత నిబంధనల్లో మార్పు లేదు:

కొత్త పింఛన్ల కోసం అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వాల హయాంలో 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ఎలిజిబిలిటీ క్రైటీరియానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకోనుంది.

ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైన పత్రాలు సమర్పించని వారు, ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.

* ధ్రువపత్రాల ఆధారంగా అర్హత పరిశీలన:

అర్హత నిర్ధారణ కోసం సంబంధిత శాఖల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోనున్నారు. వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ అవసరం.

దరఖాస్తుల పరిశీలన అనంతరం నిర్దేశిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు. అనంతరం అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేస్తారు.

* అర్హులకు దరఖాస్తులో సహకారం:

ప్రతి అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా అర్హత కలిగిన ప్రతి వితంతువు, ఒంటరి మహిళ దరఖాస్తు చేసుకోవడంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు పొందడంలో సహకరించాలని సూచించారు.

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆగస్టు 31, 2026 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తులతో పాటు వివరాలను చేయూత పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెంటనే చేపట్టనున్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో అమల్లో ఉన్న అర్హత నిబంధనలనే కొనసాగిస్తూ అర్హులైన వారికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది.

Related Articles

spot_img

Most Popular