ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి, యువజన సంఘాలపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన నిరసన సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ మాట్లాడారు. ప్రశ్నించే విద్యార్థులపై లాఠీల ప్రయోగం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని విమర్శించారు. 2014 నుంచి దేశంలో సుమారు 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇటీవల జరిగిన నీట్ పేపర్ లీకేజీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, ఫన్నీ, అర్జున్, చరణ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

