* అక్టోబర్ 25న హైదరాబాద్లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహణపై చర్చ
* తెలంగాణ, కొరియా సంస్కృతుల వైభవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక వేదికగా నిలవనున్న హైదరాబాద్
* భారత్లో కే-డ్రామాల ఆదరణతో సాంస్కృతిక అనుబంధం మరింత బలోపేతం
* ప్రజల మధ్య సంబంధాలు, కళా-సాంస్కృతిక భాగస్వామ్యానికి ప్రాధాన్యం: మంత్రి జూపల్లి.
హైదరాబాద్ల: ఈ ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ – కొరియన్ కల్చరల్ సెంటర్ లు సంయుక్తంగా సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. తెలంగాణ-కొరియా మధ్య పర్యాటక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు పక్షాలు చర్చించాయి.
భారత్లోని కొరియన్ కల్చరల్ సెంటర్ (KCCI) డైరెక్టర్, భారతదేశంలోని కొరియా రాయబార కార్యాలయం కల్చర్ అండ్ ప్రెస్ కౌన్సిలర్ హ్వాంగ్ ఇల్యాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును డా.బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వం, వైవిధ్యభరితమైన సంస్కృతి, సంప్రదాయ కళారూపాలు, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ప్రతిపాదిత తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం ద్వారా ఇరు ప్రాంతాల కళలు, సంగీతం, నృత్యం, వంటకాలు, సంప్రదాయాలను ఒకే వేదికపై ఆవిష్కరించే అవకాశం లభిస్తుందని, పర్యాటకాభివృద్ధితో పాటు ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
భారత్లో, ముఖ్యంగా యువతలో కొరియన్ కే-డ్రామాలు, కొరియన్ వినోద కార్యక్రమాలకు ఓటీటీ వేదికల ద్వారా విశేష ఆదరణ లభిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక అనుబంధం తెలంగాణ-కొరియా మధ్య పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు కళలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, సృజనాత్మక భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని అన్నారు.
పర్యాటకం, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ, సృజనాత్మక పరిశ్రమల రంగాల్లో కొరియాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, వారసత్వ పరిరక్షణ, పర్యాటక ప్రోత్సాహం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో కిమ్ కాంగ్హున్ (హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, KCCI), ఇమ్ హ్విజే (హెడ్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్, KCCI), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొరియా కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి పాల్గొన్నారు.

