ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల AISF, SFI, DYFI జాతీయ పిలుపు మేరకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది. శుక్రవారం జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అనంతరం నాయకులు భారీ ర్యాలీ, నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ప్రేమ్ కుమార్, తారా సింగ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షల్లో వరుసగా వెలుగుచూస్తున్న పేపర్ లీకేజీలు, అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాలను విడనాడి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

