◆ మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ చిట్టి రాజుల నరసింహ
ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను ఖండిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రేవల్లి సోషల్ మీడియా కన్వీనర్ చిట్టి రాజుల నరసింహ పాల్గొని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను తీవ్రంగా విస్మరిస్తున్నాయని ఆయన విమర్శించారు. విద్యావ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తేవడంలో విఫలమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కుతో ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని, కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పేపర్ లీకేజీలకు తావుండదని పేర్కొన్నారు. శాంతియుత నిరసన తెలిపే విద్యార్థుల హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చిట్టి రాజుల నరసింహ స్పష్టం చేశారు.

