* బిఎస్పి వనపర్తి జిల్లా అధ్యక్షుడు.. మిద్దె మహేష్
ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: రేవల్లి మండలం బండ రావిపాకుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెంటనే ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు ప్లే గ్రౌండ్ను సమకూర్చాలని బిఎస్పి వనపర్తి జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన గ్రామంలోని పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం క్లాసులు జరుగుతున్న తీరుపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. పాఠశాల భవనం నిర్మించి ఏడాదినర గడుస్తున్నా ఇంతవరకు కాంపౌండ్ వాల్ నిర్మించకపోవడం విచారకరమన్నారు. పాఠశాల ముందు భాగాన పొలాలు, గుట్టలు ఉండటంతో గతంలో అనేకసార్లు పాములు వచ్చాయని, ప్రహరీ లేకపోవడంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆట స్థలంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండి ఆడుకోవడానికి తీవ్ర ఆటంకంగా మారిందని, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి వెంటనే ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు మైదానాన్ని సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి గ్రామ కమిటీ అధ్యక్షుడు పూర్ణం యాదగిరి, నాయకులు హుస్సేన్, సైదులు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

