Thursday, July 16, 2026

Buy now

ప్రజల భాగస్వామ్యంతో క్రైమ్ ఫ్రీ డివిజన్ల ఏర్పాటుకు కృషి చేయాలి:పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి.

రామగుండం: పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీ బి. రామ్‌రెడ్డి వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీసీపీకి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిశుభ్రత,పరిసరాల నిర్వహణ,రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

అనంతరం పోలీస్ సిబ్బందితో పరేడ్ నిర్వహించి,వారి స్క్వాడ్ డ్రిల్,నీట్ టర్న్‌అవుట్‌ను పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు,విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన సమస్యలు,నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి,పెండింగ్ కేసుల పరిష్కార స్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని తగిన సూచనలు చేశారు.

అనంతరం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 35 డివిజన్లకు నియమితులైన డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారి విధులు,బాధ్యతలపై పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ,ప్రతి డివిజన్ పోలీస్ ఆఫీసర్ తన పరిధిలో ఆస్తి సంబంధిత నేరాలు,మహిళలపై నేరాలు,సైబర్ నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రతి డివిజన్‌లో నంబర్ ప్లేట్‌లు లేని,సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

డివిజన్ పరిధిలోని యువత,పెద్దలు, ప్రజాప్రతినిధులతో కలిసి స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు నేరాల నివారణపై అవగాహన కల్పించాలని తెలిపారు.అక్రమ వాహనాల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.డివిజన్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి,యువతను గంజాయి, మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్,లోన్ యాప్ మోసాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంచేలా అవగాహన కల్పించాలని,వారిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లించేలా ప్రోత్సహించాలని సూచించారు.

ప్రతి డివిజన్‌లోని ముఖ్యమైన వైటల్ ఇన్‌స్టాలేషన్లు, ఆసుపత్రులు, దేవాలయాలు,పెద్ద అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.అలాగే ఆయా సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది,నిర్వాహక కమిటీలు,బాధ్యుల పూర్తి వివరాలను సేకరించి,అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించేందుకు సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ప్రతి డివిజన్ పోలీస్ ఆఫీసర్ వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు తన పరిధిలో పర్యటించి స్థానికులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.ప్రతి సందర్శనలో ప్రజలతో సమయం గడుపుతూ వారి సమస్యలను తెలుసుకొని,వార్డు అధికారులతో కలిసి నైట్ హార్ట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో డివిజన్ పెద్దలు,యువతతో చర్చించి స్థానిక సమస్యలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను గుర్తించి, సంబంధిత ఇన్‌స్పెక్టర్, సెక్టార్ ఎస్‌ఐలు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రతి డివిజన్‌ను క్రైమ్ ఫ్రీ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు ఆస్తి సంబంధిత నేరాలు, సైబర్ నేరాలు, మహిళలపై నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీసీపీ స్పష్టం చేశారు.గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని డీసీపీ బి.రామ్‌రెడ్డి సూచించారు.
ఈ తనిఖీల్లో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్,ఎస్‌ఐలు రమేష్,మనోహర్, అనూష పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular