సిరిసిల్ల: తెలంగాణ సిద్ధాంతకర్త “ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్” జయంతి సందర్భంగా సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేస్తూ, తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో చైతన్యంగా మలిచిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.
సమాజం పట్ల నిబద్ధతతో జీవిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

