వరంగల్:గత మూడు రోజులుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ గురువారం ఘనంగా ముగిసింది.
ఈ డ్యూటీ మీట్లో జోనల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ పతకాలను అందజేసి అభినందించారు. ఈ పోటీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ 13 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 28 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 12, మహబూబాబాద్ జిల్లా 13, ఖమ్మం కమిషనరేట్ 9 పతకాలు సాధించాయి. విజేతలుగా నిలిచిన అధికారులు త్వరలో మల్కాజిగిరి కమిషనరేట్లో జరిగే రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, ఇలాంటి డ్యూటీ మీట్లు పోలీసు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కఠోర సాధనతో విధి నిర్వహణలో సమర్థత పెరగడంతో పాటు పని ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ కొనసాగించాలని అధికారులకు సూచించారు.
ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని కమిషనర్ అభినందించారు.కార్యక్రమంలో అదనపు డీసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, ఏసీపీ సురేంద్ర, డీఎస్పీలు శ్రీనివాస్, సాంబరాజు, ఆర్ఐ సతీష్, ఇన్స్పెక్టర్లు క్రాంతికుమార్, విశ్వేశ్వర్, శ్రీనివాస్, ఎస్ఐ విజయ్ కుమార్, ఆర్ఎస్ఐ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

