Friday, August 14, 2026

Buy now

ములుగు జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి

* ముందస్తు చర్యలతో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆదేశం.. అత్యవసర సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 7109**

ములుగు: రానున్న రెండు రోజుల్లో ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జిల్లా అధికారులతో పాటు అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నీటిపారుదల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, నీటిపారుదల శాఖ అధికారులు తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప వరద నీటిలోకి వెళ్లవద్దని, వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

భారీ వర్షాల వల్ల రహదారులు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడం, నీటిమునిగిన ప్రాంతాలు ఏర్పడడం వంటి పరిస్థితులు తలెత్తితే సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ములుగు జిల్లాలో వరదలు, రహదారులు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం, నీటిమునిగిన ప్రాంతాలు ఏర్పడడం లేదా ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇతర ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే జిల్లా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.

ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండే **టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 7109**కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, అందిన సమాచారంపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపడతారని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular