* కాలు కోల్పోయిన కార్మికుడు ఎలా విధులు నిర్వహిస్తాడు?
* సింగరేణి యాజమాన్యంపై కవిత తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్:రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న ఓ సింగరేణి కార్మికుడు మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుంటే, డ్యూటీ ఫిట్ అంటూ సర్టిఫికెట్ ఇవ్వడంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలు కోల్పోయిన కార్మికుడు ఏ విధంగా విధులు నిర్వహించగలడో సింగరేణి యాజమాన్యం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నైజమని మరోసారి రుజువైందని విమర్శించారు.
విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న కార్మికులను మెడికల్ అన్ఫిట్గా ప్రకటించకుండా, వారి వారసులకు ఉద్యోగాలు దక్కకుండా చేసే కుట్రలో సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే మెడికల్ బోర్డును నామమాత్రంగా నిర్వహిస్తున్నారని ఈ ఘటనతో స్పష్టమైందన్నారు.
మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని నిబంధనల ప్రకారం అన్ఫిట్గా ప్రకటించి, వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని ఆమె హెచ్చరించారు.

