* దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ను కోరిన ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
హైదరాబాద్: రామగుండం నియోజకవర్గంలో చేపట్టిన ఆలయాల అభివృద్ధి, నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ఠాకూర్ కోరారు.
ఈ మేరకు మంగళవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ను ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని వివిధ ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఆలయాల అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
రామగుండం నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ఈ సమావేశంలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు ఎండీ ముస్తాఫా, గట్ల రమేష్ పాల్గొన్నారు.

