పెద్దపల్లి : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు సాధించడం జిల్లాకు గర్వకారణమని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజూల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యులు మనుషుల రూపంలో ఉన్న దేవుళ్లని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డులు సాధించి, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష, జిల్లా ఉపాధ్యక్షుడు కొండి సతీష్, మహిళా కన్వీనర్ సిరవేని స్వప్న, కోమటిపల్లి సదానందం తదితరులు పాల్గొన్నారు.

