* అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతోనే భూ సమస్యల పరిష్కారం
* అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ సోమశిలలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల రైతులు నష్టపోకూడదని స్పష్టం చేశారు. వివాదాస్పద భూముల్లో ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, రికార్డులను తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనల పరిధిలో ఉన్న సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు.

