* విజేతలకు ప్రశంస పత్రాలు అందజేస్తున్నజిల్లా ఎస్పీ సునిత రెడ్డి
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్నగర్లో ఇటీవల నిర్వహించిన జోగులాంబ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 పోటీల్లో వనపర్తి జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. శాస్త్రీయ దర్యాప్తు, సైబర్ క్రైమ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ తదితర విభాగాల్లో వనపర్తి జిల్లా సిబ్బంది మొత్తం 11 పతకాలు (5 బంగారు, 5 రజత, 1 కాంస్య) సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజేతలను గురువారం జిల్లా ఎస్పీ సునిత రెడ్డి పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల్లో వృత్తి నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి డ్యూటీ మీట్లు చక్కని వేదికలని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలోనూ ఇదే స్ఫూర్తితో ప్రతిభ చాటాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఆర్ఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఎస్సై అంజద్ తదితరులు పాల్గొన్నారు.

