పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి అమర్నగర్లోని ఎంపీయూపీఎస్ (MPUPS) పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, అపరిచితుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోక్సో చట్టం, సామాజిక మాధ్యమాల ప్రభావం, బాధ్యతాయుత ప్రవర్తన, మహిళల భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచించారు. ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే షీ టీమ్ను సంప్రదించాలని కోరారు.
మహిళలు, విద్యార్థుల భద్రత కోసం బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో షీ టీమ్ నిరంతరం నిఘా నిర్వహిస్తోందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో 112 కు డయల్ చేయాలని, ఆన్లైన్ మోసాలకు గురైతే 1930 హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత కోసం ప్రయాణ సమయంలో టీ-సేఫ్ (T-Safe) యాప్ను వినియోగించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

