గోదావరిఖని: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్.ఎఫ్.సి.ఎల్. (RFCL) పహరి గోడ కూలిపోవడంతో వరద నీరు వీర్లపల్లి గ్రామంలోని పలు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లతో కలిసి వీర్లపల్లి గ్రామంలో పర్యటించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులను అప్రమత్తం చేస్తూ, బాధితులకు అవసరమైన సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం బాధిత ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

