* ఆగస్టు 24 నుంచి 26 వరకు మూడు రోజులపాటు ఉత్సవాలు
కమాన్పూర్: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ ప్రసిద్ధ శ్రీ ఆదివరాహస్వామి దేవస్థానంలో శ్రావణ మాసంలో నిర్వహించనున్న స్వామివారి జయంతి ఉత్సవాలకు ఆలయ కమిటీ తేదీలను ప్రకటించింది. ఈ సందర్భంగా ఉత్సవాల ఆహ్వాన పత్రికను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు తొలి ఆహ్వానంగా అందజేశారు.
శ్రావణ మాసంలో 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు స్వామివారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఉత్సవాల్లో వివిధ పూజలు, హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఆలయ చైర్మన్ ముస్ట్యాల దామోదర్, ఈఓ కాంతారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వరప్రసాద్ చార్యులు, ధర్మకర్తలు కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని మంత్రి శ్రీధర్బాబు స్వగృహానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు ను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఉత్సవాలకు మంత్రి శ్రీధర్బాబు ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

