– INTUC సెక్రటరీ జనరల్ డా. జనక్ ప్రసాద్
హైదరాబాద్:సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి కంటే కార్మికుల ప్రాణాలు, భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని INTUC సెక్రటరీ జనరల్ డా. జనక్ ప్రసాద్ అన్నారు. సింగరేణి సంస్థ నిర్వహించిన 50వ త్రైపాక్షిక భద్రత సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని కార్మికుల భద్రత, రక్షణ చర్యలు, ఆరోగ్య సేవలు, ప్రమాదాల నివారణపై పలు కీలక సూచనలు చేశారు.
“బొగ్గు ఉత్పత్తి కంటే ఒక్కో కార్మికుడి ప్రాణం ఎంతో విలువైనది. ప్రమాదరహిత సింగరేణి కోసం యాజమాన్యం, అధికారులు, కార్మిక సంఘాలు సమన్వయంతో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి” అని డా. జనక్ ప్రసాద్ పేర్కొన్నారు.
కార్మికులకు ఆధునిక భద్రతా శిక్షణ అందించడంతో పాటు నాణ్యమైన రక్షణ పరికరాలు, మెరుగైన వైద్య సేవలు కల్పించాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రెగ్యులర్ కార్మికులతో సమాన స్థాయిలో భద్రతా శిక్షణ, రక్షణ చర్యలు అందించాలని సూచించారు.
గనుల్లో సిబ్బంది, సూపర్వైజర్లు, అవసరమైన అధికారుల కొరతను తక్షణమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. సిబ్బంది కొరత కారణంగా భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
‘జీరో యాక్సిడెంట్’ లక్ష్యంగా చర్యలు:
సింగరేణి గనుల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని డా. జనక్ ప్రసాద్ అన్నారు. “కార్మికుల భద్రతే సింగరేణి అభివృద్ధికి పునాది. Zero Accident లక్ష్యంతో ప్రతి స్థాయిలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలి” అని ఆయన స్పష్టం చేశారు.
సమావేశంలో DGMS అధికారులు, సింగరేణి యాజమాన్యం, అధికారుల సంఘం, గుర్తింపు మరియు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గనుల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు వివిధ అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

