హైదరాబాద్,ప్రజానావ బ్యూరో: సింగరేణి ఉద్యోగుల సంక్షేమం, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు అంశాలపై సింగరేణి సీఎండీ, డైరెక్టర్ (పర్సనల్)తో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా ఈ నెలలో కార్పొరేట్ మెడికల్ బోర్డును నిర్వహించినందుకు సింగరేణి యాజమాన్యానికి జనక్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో నిర్వహించిన రెండు మెడికల్ బోర్డుల నిర్ణయాలను పునఃసమీక్షించి, అర్హత కలిగిన ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
గత ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న మెడికల్ బోర్డు మార్గదర్శకాలను యథాతథంగా కొనసాగిస్తూ వాటిని పారదర్శకంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్యపరంగా విధులు నిర్వర్తించలేని అర్హులైన ఉద్యోగులను మెడికల్ అన్ఫిట్గా ప్రకటించి, వారికి కారుణ్య నియామకాల ద్వారా కుటుంబ భద్రత కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు.
అలా చేయకపోతే కారుణ్య నియామకాల అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని, బాధిత ఉద్యోగులు, వారి కుటుంబాలకు అందాల్సిన సహాయం లక్ష్యం నెరవేరకపోయే అవకాశం ఉందని జనక్ ప్రసాద్ పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత రంగాల్లో మరింత పురోగతి సాధిస్తుందనే విశ్వాసం తమకు ఉందని ఆయన తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఉద్యోగి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు.
ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్రావు, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాస్, నాయకుడు లాగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

