– డిమాండ్లను ప్రభుత్వ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ
– విద్యాశాఖ మంత్రి రాజీనామా, సోనం వాంగ్చుక్ విడుదలకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం, సీజేపీ మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష చర్చల్లో భాగంగా ఆందోళనకారుల డిమాండ్లను ప్రభుత్వ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి అంతర్గతంగా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీజేపీ ప్రతినిధులు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లు నడ్డాను రెండుసార్లు కలిసి తమ వినతిపత్రాన్ని సమర్పించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరారు. అలాగే నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ డిమాండ్లపై ప్రభుత్వ ఉన్నత నాయకత్వంతో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని జేపీ నడ్డా చెప్పారని వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీ లేదా నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు బలప్రయోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేశారు.

