* బొగ్గు కార్మికుల జీతాలు, అలవెన్సుల పెంపునకు వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలి
* నాలుగు లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఆగస్టు 10న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా
రామగుండం: బొగ్గు గని కార్మికులు, ఉద్యోగుల జీతాలు, అలవెన్సుల పెంపు కోసం 12వ వేతన కమిటీని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయవద్దని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 10న సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదావరిఖని ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు గడ్డం కృష్ణ మాట్లాడారు.
జూలై 1 నుంచి 12వ వేతన కాల పరిమితి ప్రారంభమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వేతన కమిటీని ఏర్పాటు చేయలేదని వారు ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించనున్న ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

