హైదరాబాద్, దిల్సుఖ్నగర్:కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు డిమాండ్ చేస్తూ దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు చేపట్టిన ధర్నాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
19 వేలకుపైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం 5 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని కవిత ఆరోపించారు. 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు వారికి అండగా ఉంటానని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించిన కవిత, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు 36 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలని కోరారు.
నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదని వ్యాఖ్యానించిన కవిత, జూలై 2న సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగులకు మద్దతు ప్రకటించారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువతకు ఉద్యమకారులతో కలిసి తమ మద్దతు కొనసాగిస్తామని చెప్పారు.

