● నాగర్ కర్నూల్ కలెక్టరేట్, కొల్లాపూర్ ఆర్డీవో ఆఫీస్ లలో ఆకస్మిక తనిఖీ
● రెవెన్యూ, అటవీ అధికారులపై తీవ్ర ఆగ్రహం
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఏళ్ల తరబడి ఫైళ్లను పెండింగ్లో పెడితే సహించేది లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. సోమవారం కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన, అనంతరం నాగర్కర్నూల్ కలెక్టరేట్లో కలెక్టర్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 16 ప్రధాన సమస్యలు, భూ వివాదాలపై మంత్రి ఆరా తీశారు. ఒరిజినల్ రికార్డులను స్వయంగా పరిశీలించిన ఆయన.. గతంలో ఆదేశాలిచ్చినా ఫైళ్లు ముందుకు సాగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఒక టేబుల్ నుంచి మరో టేబుల్కు ఫైళ్లు మార్చడం పరిపాలన కాదు.. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే నిజమైన పాలన” అని స్పష్టం చేశారు. ముక్కిడిగుండం, సోమశిల, రామాపురం, జటప్రోలు ప్రాంతాల పోడు పట్టాలు, రెవెన్యూ–అటవీ భూ వివాదాలపై శాఖల మధ్య సమన్వయ లోపం ఉండకూడదని, క్షేత్రస్థాయిలో ఉమ్మడి సర్వేలు నిర్వహించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

