Thursday, July 16, 2026

Buy now

చిన్నారులే దేశ సంపద.. ఏ చిన్నారి అంగన్వాడి సేవలకు దూరం కాకూడదు: మంత్రి సీతక్క,వివేక్

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మొబైల్ అంగన్వాడి వాహనాన్ని ప్రారంభించిన మంత్రులు సీతక్క, వివేక్ చిన్నారులే దేశ సంపద, దేశ భవిష్యత్తని, తెలంగాణ–2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

అందుకే ఏ ఒక్క చిన్నారికీ అంగన్వాడి సేవలు అందకుండా ఉండకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ అంగన్వాడి కేంద్రాలను ప్రారంభిస్తోందని తెలిపారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మొబైల్ అంగన్వాడి వాహనాన్ని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు.

ఈ మొబైల్ అంగన్వాడి వాహనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీ లో అంగన్వాడి సేవలు అందించనుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇప్పటివరకు సాంప్రదాయ అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య, తల్లి శిశు సంక్షేమ సేవలు అందుబాటులో ఉండేవని, అయితే అంగన్వాడి కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులు, ముఖ్యంగా పనుల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఈ సేవలకు దూరమవుతున్నారని అన్నారు.

అలాంటి ఒక్క చిన్నారి కూడా ప్రభుత్వ సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ మొబైల్ అంగన్వాడి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

అంగన్వాడి కేంద్రాల్లో లభించే అన్ని సేవలు మొబైల్ అంగన్వాడి కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదల పర్యవేక్షణ, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లి శిశు సంక్షేమానికి సంబంధించిన అన్ని సేవలను ఈ వాహనాల ద్వారా అందిస్తామని చెప్పారు. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు ఈ మొబైల్ అంగన్వాడి వాహనాలు నేరుగా వెళ్లి సేవలు అందిస్తాయని పేర్కొన్నారు.

ఒక్కో మొబైల్ అంగన్వాడి వాహనం దాదాపు పది అంగన్వాడి కేంద్రాలకు సమానంగా సేవలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఒక్కో మొబైల్ అంగన్వాడి కేంద్రం ద్వారా సుమారు 300 మంది లబ్ధిదారులకు సేవలు అందనున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వం సేవలను ప్రజలు ఉన్న చోటుకే తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు.

చిన్నారి చిరునవ్వే నిజమైన అభివృద్ధికి ప్రతీక అని పేర్కొన్న మంత్రి సీతక్క, స్వాతంత్ర్యోద్యమ తొలి దశల్లో గ్రామాలకు వెళ్లి అక్షరాస్యత, విజ్ఞానాన్ని పంచిన చైతన్య రథాల మాదిరిగానే ఈ మొబైల్ అంగన్వాడి కేంద్రాలు కూడా ప్రతి చిన్నారికి పోషకాహారం, ఆరోగ్యం, విద్యను చేరవేసి ఆరోగ్యవంతమైన భావితరాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి చిన్నారి సమగ్ర అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి, మేడ్చల్ మల్కాజ్గిరి డి డబ్ల్యూ ఓ శారద, కార్మిక మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular