Thursday, July 16, 2026

Buy now

శాస్త్రీయంగా దర్యాప్తు చేయాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా.

రామగుండం: నేరాల దర్యాప్తును శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు.మంగళవారం కమిషనరేట్‌లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి,మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,డ్యూటీ మీట్ అనేది కేవలం అవార్డులు,రివార్డులు అందుకోవడానికి నిర్వహించే కార్యక్రమం కాదని, పోలీస్ సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి,రోజువారీ విధుల్లో స్వీయ సమీక్ష చేసుకునేందుకు ఇది ఉత్తమ వేదిక అని అన్నారు.పోటీల్లో గెలుపు,ఓటముల కంటే పాల్గొనే అధికారులు పొందే అనుభవమే ముఖ్యమని,డ్యూటీ మీట్‌లో నేర్చుకున్న అంశాలను తమ యూనిట్లలో అమలు చేస్తే పనితీరు మరింత మెరుగుపడుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో నేరాల దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించిన మెళకువలను నేర్చుకునే అవకాశం ఈ డ్యూటీ మీట్ ద్వారా లభిస్తుందని చెప్పారు.

శాస్త్రీయ దర్యాప్తు, వేలిముద్రల విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం,కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే సంక్లిష్టమైన కేసుల పరిష్కారంలో పోలీసులు తమ ఆలోచనలు, అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి డ్యూటీ మీట్‌లు దోహదపడతాయని తెలిపారు. ఈ డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులు కాళేశ్వరం జోన్ తరఫున హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొంటారని వెల్లడించారు.
కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.

సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఫోరెన్సిక్ సైన్స్,క్రిమినల్ ఇన్వెస్టిగేషన్,క్రిమినల్ లా,రాత పరీక్ష, మెడికో-లీగల్,క్రైమ్ సీన్ ఫొటోగ్రఫీ అంశాలపై రాత, ప్రాయోగిక పరీక్షలు నిర్వహిస్తారు.
యాంటీ సబోటేజ్ చెక్ విభాగంలో వాహనాల తనిఖీ,ప్రాంగణాల తనిఖీ,గదుల తనిఖీ, యాక్సెస్ కంట్రోల్ అంశాలపై పోటీలు నిర్వహిస్తారు.

కంప్యూటర్ అవగాహన విభాగంలో కంప్యూటర్ అవగాహన,ఆఫీస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై పరీక్షలు నిర్వహిస్తారు.డాగ్ స్క్వాడ్ పోటీలు విభాగంలో ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, మాదకద్రవ్యాల గుర్తింపు వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్,ప్రవీణ్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు గోపి, బాబూరావు,సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్,ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రావు,ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్,ఆర్‌ఐలు దామోదర్,శేఖర్, మల్లేశం,పెద్దన్న, రమేష్‌తో పాటు కాళేశ్వరం జోన్ పరిధిలోని వివిధ జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular