* 37 మందికి నిర్వహించిన ఇంటర్వ్యూలలో 27 మంది ఎంపిక
* జూలై 22 నుంచి హైదరాబాద్లో మూడు నెలల ఉచిత శిక్షణ
* ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్న సంస్థ
* శిక్షణ అనంతరం ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యకు అవకాశం
* ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి : జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా హైదరాబాద్కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలలో 27 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన 37 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో 27 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) పెద్దపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) మంథని, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) పెద్దపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) గోదావరిఖని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మారం, మైనారిటీ జూనియర్ కళాశాల (బాలికలు) మంథని, మోడల్ స్కూల్ధర్యాపూర్ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 22 నుంచి హైదరాబాద్లో మూడు నెలల పాటు ఉచిత భోజనం, వసతితో కూడిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ శిక్షణ ఉండనున్నదని చెప్పారు.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఉన్నత విద్యను కొనసాగించేందుకు కూడా కంపెనీ అవసరమైన సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను జిల్లాకు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 27 మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి సంస్థలో మంచి ప్రతిభ కనబరచడంతో పాటు తమ కుటుంబాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన, జిల్లా యువజన క్రీడల అధికారి సురేష్ , గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ హెచ్ఆర్ మేనేజర్ ఎం. ప్రభాకర్ రావు, హెచ్ఆర్ ప్రతినిధి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

