* రూ.12 కోట్లతో నాగర్కర్నూల్ నూతన బస్ స్టేషన్కు శంకుస్థాపన
* నాగర్కర్నూల్–వనపర్తి మధ్య ఆర్టీసీ సర్వీసుల ప్రారంభం
నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగర్కర్నూల్ నుంచి వనపర్తి వరకు కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, అక్కడి వసతులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నాగర్కర్నూల్ జిల్లా ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.మహాలక్ష్మి పథకం అమలుతో ఇప్పటివరకు 320 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి, సుమారు రూ.11,371 కోట్ల మేర ప్రయాణ ఖర్చును ఆదా చేసుకున్నారని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి, పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన దురదృష్టకర పరిస్థితులను రాష్ట్రం చూసిందన్నారు. అయితే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం కేవలం మూడు రోజుల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించిందని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు. గత పదేళ్లలో ఒక్క కొత్త బస్సును కూడా కొనుగోలు చేయలేదని, ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.
ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీని ఆపరేషనల్ నష్టాల నుంచి లాభాల దిశగా తీసుకువచ్చామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీని అమలు చేయడంతో పాటు బాండ్లు, డీఏలు విడుదల చేశామని, కారుణ్య నియామకాలు చేపట్టి కొత్త ఉద్యోగాల భర్తీ ప్రారంభించామని చెప్పారు. కొత్త బస్సుల కొనుగోలు కూడా కొనసాగుతోందన్నారు. గతంలో విధుల నుంచి తొలగించబడిన ఉద్యోగులను తిరిగి సేవల్లోకి తీసుకున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ సుమారు 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా 375 రూట్లలో బస్సులు నడుపుతూ ప్రతిరోజూ అదనంగా 7 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామని, అవసరమున్న ప్రాంతాల్లో మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రభుత్వం ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తోందని, గతంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మహిళలకు చీరల పంపిణీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించడం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారిని సాధికారత దిశగా నడిపిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షల కోసం రాజీనామా చేసి పోరాటం చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రులు పిలుపునిచ్చారు. రవాణా శాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

