● ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: భవన నిర్మాణ కార్మికులకు 50 ఏళ్లు నిండిన వాళ్లకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు రూ.5 వేల పింఛన్ అందించాలని ఏఐటీయూసీ నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ డిమాండ్ చేశారు. బుధవారం బిజినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపాగా శ్రీనివాసులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో శివశంకర్ పాల్గొని, ఏఐటీయూసీ జిల్లా మూడో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో కీలకమైన కార్మికులను చిన్నచూపు చూడొద్దన్నారు. కార్మిక కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు.
కార్మికుడు సహజ మరణం చెందితే ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు, మ్యారేజ్ గిఫ్ట్ను రూ.30 వేల నుంచి రూ.లక్షకు, ప్రసవ కానుకను రూ.లక్షకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయాలని, సబ్సిడీపై మోటార్ సైకిళ్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు డి.లక్ష్మయ్య, కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు నాగయ్య, రఫిక్, లక్ష్మణ్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.

