* ఏఈడిపి కోర్సుతో విద్యార్థులకు సువర్ణావకాశం
* ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసయ్య
పెద్దపల్లి : ఈ విద్యా సంవత్సరం నుండి పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఈడిపి అప్రెంటి షిప్ ఎంబిడెడ్ డిగ్రీ ప్రోగ్రాంలో భాగంగా బి. కం (బి.ఎఫ్.ఎస్.ఐ) కొత్త కోర్సును ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. లక్ష్మీ నర్సయ్య చెప్పారు.
కోర్స్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవడం ద్వారా వారి భవిష్యత్తుకు గట్టి పునాదిగా నిలబడుతుందని చెప్పారు. డిగ్రీ విద్యతో పాటు పరిశ్రమల్లో అప్రెంటిషిప్ ద్వారా ప్రాయోగిక శిక్షణ పొందే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అని వివరించారు.
డిగ్రీ పూర్తయ్యేసరికి పని అనుభవం, వృత్తి నైపుణ్యాలు, పరిశ్రమలతో అనుసంధానం ఏర్పడడం వల్ల ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, వృత్తిపరమైన అనుభవం కూడా అవసరమని ఈ అంశాలను ఏఈడిపి కోర్సు బి. కం (బి.ఎఫ్.ఎస్.ఐ) సమర్థవంతంగా అందిస్తుందని ప్రిన్సిపల్ లక్ష్మీ నరసయ్య చెప్పారు.
భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు, మెరుగైన వేతన అవకాశాలు, కెరీర్ అభివృద్ధికి ఇంతగానో దోహద పడుతుందని అన్నారు. మొదటి, రెండవ సంవత్సరం చదివిన తర్వాత మూడో సంవత్సరం నుండి పరిశ్రమలతో అనుసంధానించబడి అప్రెంటిషిప్ పూర్తి చేసుకుంటారని తర్వాత వెంటనే అదే పరిశ్రమలో గాని లేదా వేరే పరిశ్రమలలో గాని నేర్చుకున్న చదువు అప్రెంటిషిప్ నైపుణ్యంతో ఉద్యోగంలో చేరిపోవచ్చని, విద్యార్థులు చిన్న వయసులోనే సంపాదిస్తూ జీవితంలో తొందరగా స్థిరపడిపోవడానికి ఈ కోర్సు చక్కగా ఉపయోగపడుతుందని బలమైన విశ్వాసంతో చెప్పారు. విద్యార్థులు ఒకవేల పై చదువులు చదవాలని కోరుకుంటే పీజీ ప్రవేశ పరీక్షల ద్వారా ఉన్నత విద్యను కూడా స్వీకరించవచ్చని వివరించారు.

