*సింగరేణి మనుగడకు కొత్త బొగ్గు గనుల కేటాయింపు అవసరం: ఐఎన్టీయూసీ నేతలు**
రామగుండం : ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ డా. బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం జీడీకే-1 ఇంక్లైన్ గనిలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా గేట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ధర్మపురి, ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం మాట్లాడుతూ, సింగరేణి సంస్థ భవిష్యత్తు కోసం కొత్త బొగ్గు గనుల కేటాయింపు అత్యంత కీలకమని అన్నారు. కొత్త గనుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి సంస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైనీ బ్లాక్లో ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తాడిచర్ల బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, డా. బి. జనక్ ప్రసాద్ కీలక పాత్ర పోషించారని వివరించారు.
గత ప్రభుత్వం, గుర్తింపు సంఘం హయాంలో జరిగిన అవకతవకల కారణంగా మెడికల్ బోర్డు ప్రక్రియ నిలిచిపోయిందని ఆరోపించారు. డా. బి. జనక్ ప్రసాద్ ప్రత్యేక చొరవతో మెడికల్ బోర్డును తిరిగి ఏర్పాటు చేశారని తెలిపారు. అనారోగ్య కారణాలతో దరఖాస్తు చేసుకున్న కార్మికులకు న్యాయం జరిగేలా అర్హులైన వారిలో కనీసం 90 శాతం మందిని అన్ఫిట్గా ప్రకటించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
కార్మికులను యాజమాన్యం అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తే ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ యూనియన్ ఇప్పటివరకు యాజమాన్యం లేదా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ఒక్క కీలక ఒప్పందం కూడా సాధించలేదని విమర్శించారు.
సింగరేణిలో కార్మికులకు అవసరమైన నాణ్యమైన పనిముట్లు, భద్రతా సామగ్రి తగినంతగా అందుబాటులో లేవని, యాజమాన్యం వెంటనే వాటిని సమకూర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే సంఘం ఐఎన్టీయూసీయేనని, భవిష్యత్తులో కూడా అదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు గడ్డం కృష్ణ, రాజేందర్, వడ్డేపల్లి దాస్, కూశనపల్లి శంకర్, నవీన్, జనగామ రాజేష్, అల్లావుద్దీన్, బ్రాంచ్ సెక్రటరీ గుండేటి శ్రీనివాస్, ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ కుమార్, ఓసీపీ-5 ఫిట్ సెక్రటరీ ఆంజనేయులు, సివిల్ ఫిట్ సెక్రటరీ శ్రీనివాస్, జీడీకే-1 ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ రమేష్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ ప్రసాద్, ఇంక్లైన్ ఇన్చార్జ్ కోలిపాక శ్రీనివాస్, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ అనిల్, షిఫ్ట్ ఇన్చార్జులు బి. రామన్న, ఎస్. మొగలి, ఎం. రాజన్న, ప్రసాద్, నాయకులు రాజ్ కుమార్, కత్తెర్ల శ్రీనివాస్, కనకయ్య, వెంకటేష్, చరణ్య కుమార్, వంశీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

