Tuesday, July 28, 2026

Buy now

ఏఐటీయూసీపై విమర్శలు మానుకోవాలి

* రియాజ్ అహ్మద్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. సహించం: ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి

రామగుండం: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏఐటీయూసీపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని, హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి హెచ్చరించారు.

బుధవారం గోదావరిఖనిలోని భాస్కర్‌రావు భవన్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో ఇప్పటివరకు జరిగిన ఏడు గుర్తింపు సంఘం ఎన్నికల్లో నాలుగు సార్లు ఏఐటీయూసీ విజయం సాధించిందని, కార్మికుల ప్రయోజనాల కోసం అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న చరిత్ర తమ సంఘానికి ఉందని తెలిపారు.

ఏడో గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒక్క ఏరియాలో కూడా విజయం సాధించని హెచ్‌ఎంఎస్ యూనియన్ నాయకులు, కార్మిక హక్కుల సాధన కోసం పనిచేస్తున్న ఏఐటీయూసీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. ముఖ్యంగా రియాజ్ అహ్మద్ వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా, టిబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పదేళ్లు ఉన్న కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులు, సంస్థ కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రక్షణ సేన పేరుతో, హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కవిత వల్ల సింగరేణి కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.

సింగరేణిలో ఏఐటీయూసీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎల్లప్పుడూ “బాయి బాట” కార్యక్రమాల ద్వారా కార్మికుల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి యాజమాన్యం, ప్రభుత్వాలను ఒప్పించి అనేక హక్కులు సాధించిందని స్వామి తెలిపారు.

హెచ్‌ఎంఎస్ యూనియన్ “బాయి బాట” పేరుతో కవితను సింగరేణి ప్రాంతాల్లో తిప్పుతూ ఏఐటీయూసీపై విమర్శలు చేయడం కార్మికులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా రియాజ్ అహ్మద్ ఏఐటీయూసీపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సిర్ర మల్లికార్జున్, నాయకులు ఎర్రగొల్ల చేరాలు, పడాల కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular