* కొత్తకోటలో జి.ప. బాలికల హైస్కూల్ నూతన భవనం ప్రారంభం
* దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్ సీక్యూపీ ప్లాంట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వినబోతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామన్నారు. బుధవారం ఆయన వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్కు చెందిన ‘కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్’ తయారీ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాలమూరు కింద 90 టీఎంసీలు, డిండి కింద 30 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్రం, ఏపీ ప్రభుత్వాలను ఒప్పించి త్వరలోనే అనుమతులు సాధిస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి ట్రిపుల్ ఐటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను తీసుకొచ్చామని చెప్పారు. స్థానిక యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తూ అమర రాజా సంస్థ ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు డి. శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, తుడి మేఘా రెడ్డి, కూచకుళ్ళ రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, TGSGDCDL చైర్మన్ సరిత తిరుపతయ్య, వనపర్తి డీసీసీ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి, అమర రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తదితరులు పాల్గొన్నారు.

