ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆమె నేరుగా 17 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా మరియు వేగవంతంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించడంలో రాజీపడొద్దని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. కాగా, ఈరోజు అందిన ఫిర్యాదుల్లో 05 భూ వివాదాలు, 03 భార్యాభర్తల గొడవలు, 09 పరస్పర వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. ఎస్పీ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేశారు.

